పాఠశాలల పై విద్యామంత్రి సమీక్ష పూర్తి వివరాలు

  • విద్యా ప్రమాణాల పెంపునకు త్వరలో బోర్డు
  • రేపటి నుంచి 15 వరకు 'రాజన్న బడిబాట'
  • వచ్చే జనవరి 26న 'అమ్మ ఒడి' ప్రారంభం
  • పిల్లల్ని బడికి పంపే తల్లికి అదేరోజు 15 వేలు
  • క్లస్టర్‌ కిచెన్ల ద్వారా పిల్లలకు మధ్యాహ్న భోజనం
  • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడి

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి):ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం 'ఫీ రెగ్యులేటరీ కమిషన్‌'ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు



ఫీజుల తగ్గింపుతోపాటు ఉపాధ్యాయుల స్థితిగతులు కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయని చెప్పారు. విద్యా ప్రమాణాల పెంపు కోసం ప్రత్యేకంగా ఓ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 


విద్యాశాఖలోని వివిధ శాఖల అధిపతులు, అధికారులతో సోమవారం ఆయన సచివాలయంలో ప్రాథమికంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ జేఎ్‌సవీ ప్రసాద్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయరాజు తదితరులు పాల్గొన్నారు. 


అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. ఈ నెల 12 నుంచి 15 వరకు 'రాజన్న బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 12న స్వాగత సంబరం, 13న నందనాభినయం, 14న అక్షరం, 15న వందనం-అభివందనం కార్యక్రమాలు పాఠశాలల్లో నిర్వహిస్తామని తెలిపారు. 


పిల్లలను 'ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి'కి తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. 2020 జనవరి 26 నుంచి 'అమ్మ ఒడి' పథకం ప్రారంభిస్తామని, పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి అదే రోజు రూ.15 వేలు అందిస్తామని చెప్పారు. 


మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యేక శ్రద్ధతో పక్కాగా అమలు చేసేందుకు కార్మికుల వేతనాలను రూ.3 వేలకు పెంచినట్టు చెప్పారు. పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన, శుభ్రమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


ప్రతి 20 వేల మందికి ఒక సెంట్రలైజ్డ్‌ క్లస్టర్‌ ద్వారా వేడివేడి భోజనం అందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల ఏజన్సీలకు కాకుండా మన రాష్ట్ర ఏజన్సీలకే ఈ బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల నిమిత్తం మరో నాలుగు రోజుల్లో ఆర్‌జీయూకేటీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందన్నారు. ఆగస్టు 10 నాటికి ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. విద్యావ్యవస్థ, విద్యాశాఖలను సమూలంగా ప్రక్షాళన చేస్తామన్నారు.


పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహితం అనే మూడు అంశాల ప్రాతిపదికగా రూపొందిన మేనిఫెస్టోను విద్యాశాఖలో పక్కాగా అమలుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థుల్లో నైప్యుణ్యాలు పెంచడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. 

ప్రస్తుతం ఉన్న పాఠశాలల యథాస్థితిని ఫొటోలు తీసి, వాటిని మరమ్మతులు చేయించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ఎలా మారాయనేది వివరిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలతో పాటు విద్యాశాఖలో అవసరమైన మేరకు ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల పై విద్యామంత్రి సమీక్ష పూర్తి వివరాలు"

Post a Comment