నగదుతీస్తే వాతే! ఏడాదికి రూ.10 లక్షలు మించితే 5% పన్ను యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: ప్రజల్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అధికక విలువుండే నగదు లావాదేవీలను నియంత్రించడం, డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేయడంవంటి చర్యల దిశగా యత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏడాది వ్యవధిలో మొత్తంగా రూ.10లక్షలు మించి బ్యాంకుల నుంచి డబ్బులు ఉపసంహరిస్తే, 3 నుంచి 5 శాతందాకా పన్ను విధించాలని యోచిస్తోంది.
దీనివల్ల నగదు వినియోగాన్ని తగ్గించడం, నల్లధనాన్ని అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఏడాదికి రూ.10 లక్షలకుపైగా ఉపసంహరించడం వల్ల రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా చెల్లించాల్సి రావడం నష్టమేనని, దీనివల్ల భారీస్థాయి నగదు లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రూ.10 లక్షలకుపైగా నగదు ఉపసంహరణ చాలా మంది వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు అవసరం ఉండదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం వేయకూడదనేది ప్రభుత్వం ఉద్దేశంగా ఉన్నట్లు సమాచారం.
ఈ తరహా నిర్ణయంపై అంతర్గతంగా చర్చ జరుగుతోందని, పన్ను 3 నుంచి 5 శాతం మధ్య ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం బ్యాంకులు ఆన్లైన్ నగదు బదిలీలపై విధించే ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ చెల్లింపు సేవలపై రుసుముల్ని రిజర్వు బ్యాంకు ఎత్తివేసిందని చెబుతున్నారు.
ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై బ్యాంకులు విధిస్తున్న రుసుములపై సమీక్ష నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల స్థాయిలోనే ఉందని, దీనికి సానుకూలత వ్యక్తమవుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. బడ్జెట్ నాటికి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనతోపాటు అధిక విలువైన నగదు ఉపసంహరణలు అన్నింటికీ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వ్యక్తిగత స్థాయిలో పరిశీలన ఉండటంతోపాటు, పన్ను చెల్లింపులపైనా నిఘా ఉంటుందని భావిస్తున్నారు. పెట్టుబడి తదితర వ్యయాలపైనా పరిమితులు విధించే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నేపథ్యం..
* 2005-08 మధ్య కరెంటు ఖాతాల నుంచి రూ.50 వేలకు మించి చేసే ఉపసంహరణలపై యూపీఏ ప్రభుత్వం పన్ను విధించింది. లెక్కలోకి రాని ధనాన్ని గుర్తించేందుకు ఈ చర్యకు దిగింది. చెక్కుల ద్వారా కాకుండా నగదు చెల్లింపులపైనే పన్ను విధించింది.
* 2015లో గ్రీకు ఆర్థిక వ్యవస్థ దివాలా తీసినప్పుడు లక్షలమంది ప్రజలు భయభ్రాంతులకు గురై 28 బిలియన్ల యూరోలకుపైగా బ్యాంకుల నుంచి తీసేసుకున్నారు. దీనితో బ్యాంకుల్లో నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనిని అరికట్టేందుకు గ్రీకు బ్యాంకులు నగదు ఉపసంహరణలపై పన్నుల్ని ప్రతిపాదించాయి.
పన్ను ఎగవేతను అరికట్టేందుకు అన్ని లావాదేవీలకు డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం చేయాలని పేర్కొన్నాయి. నగదు ఉపసంహరణలపై సర్ఛార్జిని విధించాయి
.
* ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 2017లో డిజిటల్ చెల్లింపులపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ నగదు లావాదేవీలపై పన్ను ఉండాలని, భారీ స్థాయి నగదు లావాదేవీలపై పరిమితి ఉండాలని, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకంగా కార్డు చెల్లింపులపై రుసుముల్ని పూర్తిగా ఎత్తివేయాలని సూచించింది. రూ.50 వేలు, అంతకుమించి ఉపసంహరణలపై బ్యాంకింగ్ నగదు లావాదేవీల పన్ను(బీసీటీటీ) విధించాలని పేర్కొంది.
* నగదు లావాదేవీల్ని నియంత్రించే నిబంధనను ఉల్లంఘించే వారిపై సదరు మొత్తానికి సమానంగా జరిమానా విధించాలని ‘ఆర్థికచట్టం-2017’ స్పష్టం చేస్తోంది. దీనిప్రకారం ఒకరోజు వ్యవధిలో రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీ జరపకూడదు.
* భారీస్థాయి నగదు లావాదేవీలను అరికట్టేందుకు, నల్లధన ఆర్థిక వ్యవస్థను నిలువరించేందుకు రూ.3 లక్షలకు మించే లావాదేవీలపై నిషేధం విధింపును 2017-18 బడ్జెట్లో నాటి ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రతిపాదించారు. అయితే, ఆర్థికబిల్లు2017 ద్వారా సవరణ తీసుకొచ్చి సదరు పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించారు
0 Response to "నగదుతీస్తే వాతే! ఏడాదికి రూ.10 లక్షలు మించితే 5% పన్ను యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం"
Post a Comment