గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం
10న కచ్చితమైన ఓటర్ల జాబితా ప్రచురిస్తాం
జిల్లాలో 19,29,370 మంది గ్రామీణ ఓటర్లు
ఎన్నికల అంచనా వ్యయం రూ.20 కోట్లు
'న్యూస్టుడే'తో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావు
పంచాయతీ ఎన్నికలు తొలిదశలో త్వరలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్కుమార్ శుక్రవారం ప్రకటించడంతో..
ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ఈనెల 10వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురించేందుకు సిద్ధం చేస్తున్నారు.
ప్రశ్న: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలు కొలిక్కి వచ్చాయా? ఏవిధంగా చేస్తున్నారు?
జవాబు: ఈనెల 10వ తేదీన జిల్లాలోని 909 గ్రామ పంచాయతీల్లో కచ్చితమైన, పారదర్శకమైన, ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాను ప్రచురించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే దాదాపు అన్ని మండలాల్లో పూర్తిచేశాం. జిల్లాలో 19,29,370 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 9,62,883, మహిళలు 9,66,307, ఇతరులు 180 మంది ఉన్నారు.
ప్రశ్న: ఏ ప్రాతిపదికన ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నారు? వీటిలో ఇబ్బందులున్నాయా?
జ: ఈ ఏడాది మార్చి 23 తేదీన అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీలకు జాబితా సిద్ధం చేస్తున్నాం. వీటిని వార్డుల వారీగా విభజిస్తాం. ఈనెల 10న ప్రచురించే జాబితాల్లో ఓటర్ల కులాలు ప్రచురించం.
ప్రశ్న: జిల్లాలో కొత్త పంచాయతీలుగా ఏర్పడిన గిరిజన తండాల్లో ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జ: జిల్లాలో కొత్తగా 20 గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాం. ఇప్పుడు ఈ పంచాయతీల్లో కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నాం. తొమ్మిది తండాల్లో ఇతర ఓట్లు కలిశాయి. వాటిని సరిచేసి సిద్ధం చేస్తున్నాం. ఈమేరకు ఈవోఆర్డీలకు బాధ్యతలు అప్పగించాం.
ప్రశ్న: ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు జిల్లాలో అధికంగా పంచాయతీ కార్యదర్శుల కొరత ఉంది కదా? ఇది సమస్య కావడం లేదా?
జ: జిల్లాలో 909 పంచాయతీలకు 490 మంది కార్యదర్శులున్నారు. ఓటర్ల జాబితా సవరణ, తయారీకి ఇబ్బందులున్నాయి. అయినా ఎక్కడ ఎక్కువ కార్యదర్శులున్నారో.. వారి ద్వారా చేయిస్తున్నాం.
ప్రశ్న: జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో ఏళ్ల తరబడి కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు కదా? మరి ఎన్నికల్లో వీరిని బదిలీ చేస్తారా?
జ: కొన్ని పంచాయతీల్లో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఎన్నికల్లో వీరు ప్రభావితం చేసేందుకు అవకాశముండవచ్ఛు కానీ, బదిలీలపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల సంఘం ఆదేశిస్తే.. బదిలీలు చేపడతాం.
ప్రశ్న: గతంలో కూడా పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలు సిద్ధం చేశారు. వాటి పరిస్థితి ఏమిటి? ఎంత నిధులు వెచ్చించారు.?
జ: గత ఏడాది ఆగస్టు 2వ తేదీకి పంచాయతీ పాలకవర్గం గడువు పూర్తయింది. దీంతో 15.5.2018న ఓటర్ల జాబితా విడుదల చేశాం. కానీ, ఎన్నికల ప్రక్రియ జరగలేదు. ప్రభుత్వ నుంచి రూ.69 లక్షలు విడుదలైనా.. రూ.13 లక్షల వరకు చెల్లించాం.
ప్రశ్న: ప్రస్తుత పంచాయతీ ఎన్నికలకు ఎంత వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు?
జ: జిల్లాలోని 909 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రూ.20 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నాం. ఓటర్ల జాబితా కోసం రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈమేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం.
0 Response to "గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం"
Post a Comment