దిల్లీ: ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు బదులుగా పాత వాటినే పరిగణనలోకి తీసుకునేలా సీబీఎస్ఈని ఆదేశించాలని కోరుతూ 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్ ఎం.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కరోనా దృష్ట్యా సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల విషయంలో అంతర్గత పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకొని ఫలితాలను ప్రకటించింది. మార్కులపై సంతృప్తి చెందని వారు ఆగస్టు-సెప్టెంబరులో జరిగే ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపింది. అసలు పరీక్షలు, ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో దేంట్లో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే ఖరారు చేసుకొనే అవకాశం మొదట ఉండేది. ప్రస్తుతం మాత్రం ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని, మొదటి ఫలితాలు రద్దవుతాయని తెలపడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన కొందరు విద్యార్థులు తప్పినట్టు ప్రకటించగా, మరికొందరికి తక్కువగా మార్కులు వచ్చాయి. దాంతో మునుపటి నిబంధనల ప్రకారం తమ పాత మార్కులనే ఖరారు చేసేలా ఆదేశించాలని వారు కోరారు. ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల ఆరో తేదీకి వాయిదా వేసింది
0 Response to "CBSE: పాత మార్కులనే ఖరారు చేయండి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సీబీఎస్ఈ విద్యార్థులు"
Post a Comment