జీతమో రామచంద్రాఅనే పరిస్థితి మంత్రుల ఇళ్లలో కుక్క బిస్కట్లకూ ఉద్యోగుల బడ్జెట్‌ నుంచే వేతనాలు, పింఛన్లపై అడగాలన్నా సచివాలయంలో ఎవరూ కనిపించరు ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి వ్యాఖ్యలు సంక్రాంతిలోపు బకాయిలన్నీ చెల్లించాలి: బొప్పరాజు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, కరవుభత్యం బకాయిల సంగతి దేవుడెరుగు... జీతమో రామచంద్రా అనే పరిస్థితి వచ్చిందని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. 






మంత్రుల ఇళ్లలో కుక్కలకు పెట్టే బిస్కట్ల నిధులూ ఉద్యోగుల బడ్జెట్‌ నుంచే కేటాయిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల బడ్జెట్‌ను ఇతర అవసరాలకు కేటాయించడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు తమ చేతులతో పింఛన్లు ఇప్పిస్తూ జీతాల్లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పదోతేదీ వచ్చినా పింఛన్లు, జీతాలు అందనివారున్నారని, వీటిపై ఆర్థికశాఖ సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. సచివాలయానికి వెళ్తే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, అధికారులు ఎస్‌ఎస్‌ రావత్‌, సత్యనారాయణ కనిపించట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులే కదా అని చిన్నచూపు చూస్తున్నట్లు తాము భావిస్తున్నామని తెలిపారు. ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు శనివారం విజయవాడలో సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. దసరా కానుకగా 11వ పీఆర్‌సీ ప్రకటించాలని, డీఏ సహా బకాయిలన్నీ సంక్రాంతిలోగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కలిసి పోరాడితే ఎలా ఉంటుందో చూపిస్తాం

ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఉద్యోగులు ఇక ఆగే పరిస్థితి లేదని ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇన్నాళ్లూ వేర్వేరుగా పోరాడిన తాము కలిసి పోరాడితే ఎలా ఉంటుందో చూపిస్తామని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని స్పష్టం చేశారు. ‘హెల్త్‌కార్డులు ఉన్నా ఉద్యోగులకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు అందడం లేదు. 39 నెలలుగా పీఆర్‌సీ కోసం ఎదురుచూస్తున్నాం. ఈలోపు ఎంతోమంది ఉద్యోగులు రిటైరవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? వాటితో పోలిస్తే మాకు ఇచ్చేది ఎక్కువేమీ కాదు. ఆర్థిక అంశాలతో పాటు ఆర్థికేతరమైనవీ పరిష్కారం కావట్లేదు. వైద్యారోగ్య శాఖËలో 70 మందికి పదోన్నతులు కల్పించాలి. సీఎం ఆదేశించినా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. దసరా సందర్భంగా ఇంటికి అల్లుడిని తీసుకొస్తే కొత్త దుస్తులు కాదు.. భోజనం పెట్టలేని పరిస్థితి పెన్షనర్లకు ఎదురవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ బడ్జెట్‌ ఏడాదిగా రావడం లేదు. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసినా.. మరుగుదొడ్లు శుభ్రం చేసే సిబ్బంది లేరు’ అని వారు మండిపడ్డారు. ‘మేం ఉద్యమాల్లోకి కొత్తగా వచ్చామా..? పదవీ విరమణకు దగ్గర ఉన్నాం. ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తే భయపడే పరిస్థితిలో లేము. ఉద్యోగ సమస్యల పరిష్కారం తప్ప మేం ఏ పార్టీకీ తొత్తులుగా ఉండబోం. ఉద్యోగుల ఆవేదన చూసే కలిసిపోయాం’ అని బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చీకటి ఒప్పందాలతో ఆయన సంఘానికి గుర్తింపు తెచ్చుకున్నారని విమర్శించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జీతమో రామచంద్రాఅనే పరిస్థితి మంత్రుల ఇళ్లలో కుక్క బిస్కట్లకూ ఉద్యోగుల బడ్జెట్‌ నుంచే వేతనాలు, పింఛన్లపై అడగాలన్నా సచివాలయంలో ఎవరూ కనిపించరు ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి వ్యాఖ్యలు సంక్రాంతిలోపు బకాయిలన్నీ చెల్లించాలి: బొప్పరాజు"

Post a Comment