అమరావతి: వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించకపోవడం ప్రభుత్వానికి లోపించిన ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తోందని విమర్శించారు.
ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసునని.. జీతం, పింఛనుతో ఆత్మాభిమానంతో జీవిస్తారని అన్నారు. ఉద్యోగులు తమకు వచ్చే జీతాన్ని ప్రణాళికతో ఖర్చు చేసుకుంటారని, బ్యాంకు రుణాల వాయిదాలు, పిల్లల చదువుల ఖర్చులు, వైద్య అవసరాలు.. ఎన్నో ఉంటాయన్నారు. నిర్దేశిత సమయానికి జీతం ఇవ్వకపోతే ఎంతకాలం వారు చేబదుళ్లతో నెట్టుకురావాలని ప్రశ్నించారు. పోలీసు సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని, వారికి 11 నెలల నుంచి టీఏ చెల్లించడంలేదని, వారి సరెండర్ లీవులకు రావాల్సిన సొమ్ములు ఇవ్వలేదన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి రావడంతోనే అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించానన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు 7 డీఏలు బకాయిపడిందని, పీఆర్సీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. జీతం ఇవ్వడం ఆలస్యం చేస్తే డీఏలు, టీఏలు, పీఆర్సీలు అడగరని... జీతం వస్తే అదే పదివేలు అనుకొంటారనే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే పెరిగిందని లెక్కలు చెబుతున్నాయని, ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు చేయడం లేదంటే ప్రభుత్వ ఆదాయం ఎటుపోతోంది? అని పవన్ ప్రశ్నించారు. ప్రతి నెలా తీసుకొస్తున్న అప్పులు ఏమైపోతున్నాయని నిలదీశారు
0 Response to " "
Post a Comment