Covid: కొవిడ్ జాగ్రత్తలు పాటించండి.. దంత వైద్యులకు కేంద్రం సూచనలు తాజా మార్గదర్శకాలు జారీ
ఈనాడు, దిల్లీ: దంత వైద్యశాలలకు వచ్చే రోగులందరినీ కరోనా వైరస్ను వ్యాప్తి చెందించేవారిగానే పరిగణించాలని.. తదనుగుణంగానే సంబంధిత వైద్యులు, సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఈమేరకు గత ఏడాది మే 19న జారీచేసిన మార్గదర్శకాలను సవరించి.. కొత్తవాటిని బుధవారం విడుదల చేసింది. వివరాలివి..
- కొవిడ్ కాలంలో దంత వైద్యులు, సంబంధిత సిబ్బందితో పాటు చికిత్స కోసం వచ్చేవారు కూడా ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చెందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రోగులకు కరోనా లక్షణాలు లేనప్పటికీ వారు వైరస్ను వ్యాపింపజేయొచ్చు. ఈ మేరకు తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
వ్యాక్సిన్ తీసుకున్నవారిని, ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో ‘నెగెటివ్’ వచ్చినవారిని, కొవిడ్ సోకినప్పటికీ లక్షణాలు తగ్గిపోయి 14 రోజులు గడిచినవారిని తక్కువ ముప్పున్న రోగులుగా పరిగణించవచ్చు. కొవిడ్ లక్షణాలున్న వారిని, పాజిటివ్ వచ్చిన వారిని ఎక్కువ ముప్పున్నవారుగా పరిగణించాలి. ఈమేరకు నిబంధనలను పాటిస్తూ కేవలం అత్యవసర వైద్యం మాత్రమే అందించాలి.
- కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరికరాలు లేకపోతే రోగులను ఉన్నతశ్రేణి ఆసుపత్రులకు పంపాలి. దంత వైద్యులు.. సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకొనేలా చూడాలి. సాధారణ దంత సమస్యలున్నవారు 1800 1120 32 నంబర్లో సంప్రదించాలి.
- ముందస్తు అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే రోగులను అనుమతించాలి. ఒక గదిలో ఒకరిని మాత్రమే పరీక్షించాలి. పరీక్షించేటప్పుడు ప్రతి ఇద్దరి మధ్య కొంత సమయం ఇవ్వాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారికి ఉదయం వేళ ప్రత్యేక సమయం కేటాయించాలి
0 Response to "Covid: కొవిడ్ జాగ్రత్తలు పాటించండి.. దంత వైద్యులకు కేంద్రం సూచనలు తాజా మార్గదర్శకాలు జారీ"
Post a Comment