Vaccination: కొవిడ్ టీకా పంపిణీలో రికార్డు బ్రేక్ చేసిన భారత్
దిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ గత రికార్డును తిరగరాసింది. ఈ నెల 27న ఒక్కరోజే కోటి డోసులకు పైగా పంపిణీ చేసి రికార్డు సృష్టించిన భారత్.. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే దాన్ని బ్రేక్ చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.16 కోట్ల డోసులు పంపిణీ చేసింది. ఈ అద్భుతమైన ఫీట్ సాధించిన సిబ్బందికి అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 65, 03,29,061 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. వీరిలో 50,12,44,655 మంది తొలి డోసు తీసుకోగా.. 14,90,84,406 మందికి సెకండ్ డోసు కూడా పూర్తయింది. ఈ ఒక్కరోజులోనే ఇప్పటివరకు 1,16,75,552 మందికి టీకా వేసినట్టు కొవిడ్ పోర్టల్ సూచిస్తోంది. ఇంకా ఈ రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
మరో అరుదైన మైలురాయి..
మరోవైపు, ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించిన భారత్ మరో కీలక మైలురాయిని చేరింది. ఇప్పటివరకు 50 కోట్ల మందికి తొలి డోసు పంపిణీని పూర్తిచేసినట్టు మాండవీయ వెల్లడించారు. ఈ మహత్తర ఘనత సాధించడంలో సహకరించిన కొవిడ్ వారియర్లు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ నెల 27న సాధించిన ఫీట్పై భారత్కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. కరోనాపై పోరాటంలో భారత్ కృషిని డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ప్రశంసించారు
0 Response to "Vaccination: కొవిడ్ టీకా పంపిణీలో రికార్డు బ్రేక్ చేసిన భారత్"
Post a Comment