స్కూళ్లలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ను సమర్థవంతంగా పాటించేలా చర్యలు

, అమరావతి: స్కూళ్లలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ను సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుత తరుణంలో విద్యా శాఖతో వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్, ప్రొటోకాల్‌ అమలు, థర్డ్‌వేవ్‌ సన్నద్ధతపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కూళ్లలో టెస్టింగ్‌కు చర్యలు తీసుకోవాలని, ఒక వేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఇస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున పెళ్లిళ్లుంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. పెళ్లిళ్లలో 150 మందిలోపే ఉండేలా చూసుకుంటే బావుంటుందని సూచించారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "స్కూళ్లలో కోవిడ్‌ ప్రొటోకాల్‌ను సమర్థవంతంగా పాటించేలా చర్యలు "

Post a Comment