AP news: ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలా..? 4 వారాల్లో నిర్మాణాలను తొలగించండి: హైకోర్టు
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), సచివాలయాలు నిర్మించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తం ఏడుగురు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, బి.రాజశేఖర్,
వి.చినవీరభద్రుడు, శ్యామలరావు తదితరులు విచారణకు హాజరయ్యారు. మొత్తం 1160 చోట్ల ఆర్బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో మిగతా నిర్మాణాలను 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
తుది తీర్పునకు లోబడే లోకాయుక్త ఏర్పాటు
మరోవైపు కర్నూలులో హెచ్ఆర్సీ, లోకాయుక్తపై దాఖలైన పిటిషన్పైనా హైకోర్టులో విచారణ జరిగింది.హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లోకాయుక్త కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా చర్యలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి గత శనివారం నగరంలో పర్యటించారు. ఇన్ఛార్జి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్తో కలిసి ఎంపిక చేసిన మూడు భవనాలను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో జేసీ రామసుందర్రెడ్డి ఇతర జిల్లా అధికారులతో సమీక్షించారు. మూడు భవనాల్లో ఒకటి ఎంపిక చేసే అవకాశం ఉందని, కార్యాలయ ఏర్పాట్లకు కొంత గడువు కోరినట్లు జిల్లా అధికారులు తెలిపారు
0 Response to "AP news: ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలా..? 4 వారాల్లో నిర్మాణాలను తొలగించండి: హైకోర్టు"
Post a Comment