ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
- ఏప్రిల్లో జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశం
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో సీఎస్
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశం ఏప్రిల్లో నిర్వహిస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను సీఎస్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ కు విన్నవించారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ప్రతినిధులు కోరారు. రాష్ట్ర సచివాలయంలో అదనపు పోస్టులు మంజూరు చేయాలని సచివాలయ సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. ఉద్యోగినులకు 5 ప్రత్యేక సెలవుల మంజూరుకు ప్రభుత్వం అంగీకరించిందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మార్చి 8 లోపే జీఓ జారీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో ఏపీఎన్టీవో సంఘం నేత చంద్రశేఖర్రెడ్డి, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
0 Response to "ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం"
Post a Comment