5 నుంచి స్కూళ్లు సాధ్యమా
రాష్ట్ర వ్యాప్తంగా తగ్గని కరోనా తీవ్రత
వైరస్ వ్యాప్తిని సర్కారు తేలిగ్గా భావిస్తోందా?
విద్యార్థుల తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన
పునఃప్రారంభంపై ప్రభుత్వంలోనూ తర్జనభర్జన
‘విద్యా కానుక’ పంపిణీతో సరిపెట్టడంపై ఆలోచన
ఇప్పుడు స్కూల్ మాటే వద్దు: మేధావులు, నేతలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను సెప్టెంబరు 5నుంచి పునః ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆచరణ సాధ్యమేనా? కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గని నేపథ్యంలో తల్లిదండ్రులు తమ చిన్నారులను స్కూళ్లకు పంపిస్తారా? అనే ప్రశ్నలకు సంబంధిత వర్గాలు కూడా మౌనం పాటిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడంలేదు. ఈ నేపథ్యం లో రాష్ట్రప్రభుత్వం 5నే పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానున్న అన్లాక్ 4.0 నిబంధనల్లో కూడా పాఠశాలలు, కళాశాలలను తెరవరాదని కేంద్రం స్పష్టం చేయబోతున్నట్టు సమాచారం. అంటే ఇప్పట్లో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభించే అవకాశం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలు ప్రారంభించే పరిస్థితి లేదని కేంద్రానికి లేఖ రాసింది. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం పాఠశాలలను తెరిపించాలన్న పట్టుదలతో వ్యవహరిస్తుండడంపై విద్యావేత్తలు, మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశాలు నేర్పుతున్న పాఠం!
వైరస్ అంతో ఇంతో తగ్గిందని భావించిన జర్మనీ.. పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండువారాలు కూడా గడవకుండానే బెర్లిన్లోని పాఠశాలల్లో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. వందల సంఖ్యలో విద్యార్థులు, టీచర్లు క్వారంటైన్కు వెళ్లాల్సి వచ్చింది. ప్రాథమిక, ఉన్నతవిద్య(బ్రేడ్) పాఠశాలలన్నింటా వైరస్ వ్యాప్తి చెందింది. అమెరికాలోనూ స్కూళ్లు తెరిచిన కొద్ది రోజుల్లోనే 2,100మంది విద్యార్థులు(5-18 ఏళ్లలోపు) కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయా దేశాలు తమ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నాయి.
విద్యాసంస్థల్లో కరోనా ప్రబలితే విద్యార్థులు, టీచర్లకే కాకుండా వారి కుటుంబ సభ్యులకూ వైరస్ సోకి అది సామాజిక సంక్రమణానికి దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు స్కూల్ మాట ఎత్తితేనే ఒణికిపోతున్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా సగటున 8 వేల నుంచి 10 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు, సిబ్బం ది కూడా కరోనా బాధితుల్లో ఉన్నారు. వీరిలో పలువురు టీచర్లు మృతి చెందారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో 5 నుంచి పాఠశాలలు ప్రారంభించడం అవసరమా అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పాఠశాలలు తెరిచే ఆలోచన చేయవద్దని తల్లిదండ్రులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు
0 Response to "5 నుంచి స్కూళ్లు సాధ్యమా"
Post a Comment