పీఆర్‌సీ కోసం వైద్యుల పోరుబాట


  • 14 ఏళ్ల నుంచి ఎదురు చూపులు.. అసిస్టెంట్‌కు, పీజీకి ఒకే వేతనం
  • ఆందోళనలకు ప్రభుత్వ వైద్యులు సిద్ధం
  • ఈ వారంలో నల్లబ్యాడ్జీలతో నిరసన
  • స్పందించకుంటే విధుల బహిష్కరణే
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఏపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు పీజీ విద్యార్థులకు పెద్ద వ్యత్యాసం లేదు. పేరుకు మాత్రం అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. పీజీ విద్యార్థులకు స్టయిపెండ్‌ ఇస్తుంది. అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల జీతాలకు, విద్యార్థుల స్టయిపెండ్‌కు కూడా పెద్ద వ్యత్యాసం లేదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వేతనం రూ.60 వేలు కాగా పీజీ విద్యార్థి స్టయిపెండ్‌ సుమారు రూ.58 వేలు. గత 14 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పీజీ విద్యార్థుల స్టయిపెండ్‌ ఎప్పటికప్పుడు రివైజ్‌ అవుతోంది. కొన్ని రోజులు ఆగితే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీతం కంటే వీరి స్టయిపెండే ఎక్కువయ్యే పరిస్థితి రానుంది. ఇక, ప్రొఫెసర్ల జీతాలు 14 ఏళ్ల నుంచి పెరగడం లేదు. ఏపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీతం రూ.60 వేలు అయితే.. తెలంగాణలో పీజీ విద్యార్థి స్టయిపెండే రూ.70 వేలు వరకు ఉంది. అంటే తెలంగాణలో పీజీ విద్యార్థుల పరిస్థితే మెరుగ్గా ఉంది.
 
డీఎంఈ వైద్యులకు పీఆర్‌సీని అమలు చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. 2006లో అప్పటి వైఎస్‌ ప్రభుత్వం డీఎంఈలోని వైద్యులను యుజీసీ స్కేల్‌ పరిధిలోకి తెచ్చింది. అప్పటి నుంచి డీఎంఈ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల పరిస్థితి దారుణంగా మారింది. 2006 నుంచి నేటి వరకు వారి జీతాలు రివైజ్‌ కాలేదు. దీంతో 2006 పీఆర్‌సీ ప్రకారమే వైద్యులు జీతాలు పొందుతున్నారు. నిబంధనల ప్రకారం పదేళ్లకు ఒకసారి పీఆర్‌సీని అమలు చేయాలి. 2006 తర్వాత 2016లో వైద్యులందరికీ కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాలు రావాలి. కానీ, ఇప్పటి వరకు కొత్త పీఆర్‌సీ అమలు కాలేదు. రాష్ట్రంలో యుజీసీ స్కేల్‌ ప్రకారం జీతాలు తీసుకుంటున్న ఉన్నత విద్యామండలి సిబ్బంది, యూనివర్సిటీ ఉద్యోగులకు 2016 పీఆర్‌సీని గతేడాది మార్చిలో గత ప్రభుత్వం అమలు చేసింది. ప్రస్తుతం ఉన్నత విద్యామండలి సిబ్బంది మొత్తం 2016 పీఆర్‌సీ ప్రకారమే జీతాలు తీసుకుంటున్నారు. ఒక్క బోధనాసుపత్రి సిబ్బంది మాత్రమే పాత పీఆర్‌సీ ప్రకారం జీతాలు తీసుకుంటున్నారు. మరోవైపు బోధనాసుపత్రుల వైద్యుల కంటే డీహెచ్‌, ఏపీవీవీపీ వైద్యుల జీతాలు కూడా అధికంగా ఉంటున్నాయి. పదేళ్ల క్రితం బోధనాసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేసి, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ కంటే, డీహెచ్‌ పరిధలోని పీహెచ్‌సీలో విధులు నిర్వహించే వైద్యులు లక్షల్లో జీతాలు పొందుతున్నారు. కేవలం పీఆర్‌సీని అమలు చేయకపోవడం వల్లే బోధనాసుపత్రుల వైద్యులకు అన్యాయం జరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
 
పోస్టులు భర్తీ కావడం లేదు
రాష్ట్రంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఏటా 5 వేల మంది విద్యార్థులు మెడిసిన్‌ పూర్తి చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత మాత్రం తీరడం లేదు. రెండేళ్ల కిందటి వరకు ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు ఉండగా, గత ప్రభుత్వం వైద్యుల కొరత నేపథ్యంలో 63 ఏళ్లకు పెంచింది. అయినా, ఉపయోగం కనిపించలేదు. వాస్తవంగా వైద్యులకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోకపోవడం వల్లే కొత్త వారు ప్రభుత్వ సేవలోకి రావడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 11 బోధనాసుపత్రుల్లో 2,800 మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు కాకుండా అదనంగా మరో 1000 మంది వైద్యుల వరకు బోధనాసుపత్రుల్లో అవసరం ఉంది. కానీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు ఇచ్చే జీతాలు చాలా తక్కువగా ఉండడం వల్ల కొత్త వైద్యులు రావడం లేదు.
 
వేతనాల్లో వ్యత్యాసం
కొత్తగా విధుల్లో చేరిన స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులకు ప్రభుత్వం నెలకు రూ.60 వేలు ఇస్తోంది. అదే స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తే నేలకు రూ.2 నుంచి 3 లక్షల వరకు జీతం వస్తుంది. కార్డియాలజీ, రేడియాలజీ వైద్యులకు రూ.5 లక్షల వరకు ప్రైవేటు ఆసుపత్రులు ఇస్తున్నాయి. ఈ స్థాయిలో ప్రభుత్వం జీతాలు ఇవ్వడంలేదు. అదేసమయంలో నిబంధనల ప్రకారం అందించాల్సిన పీఆర్‌సీని కూడా ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వం స్పెషాలిటీ వైద్యుల పోస్టుల భర్తీకి ఎన్నిసార్లు నోటిఫికేషన్‌ విడుదల చేసినా భర్తీ కావడం లేదు.
 
ఆందోళనలకు సిద్ధం
నాలుగేళ్ల నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాసుపత్రుల వైద్యులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు దీనిపై చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. పైగా, పీఆర్‌సీపై వినతిపత్రాలు ఇస్తున్న వైద్యుల్ని ఆర్థిక శాఖ సిబ్బంది హేళన చేస్తుండడంతో వైద్యుల సంఘం నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తొలుత నల్లబ్యాడ్జీలు ధరించి విధులుకు హాజరుకావాలని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే విధులు బహిష్కరించాలని భావిస్తున్నారు.
 
10 కోట్లు కేటాయించలేరా?
ఏడు నెలల నుంచి ఆర్థిక శాఖ మంత్రి, సెక్రటరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. వంద సార్లు వినతిపత్రాలు ఇచ్చాం. పీఆర్‌సీ అమలు కావడం లేదు. వైద్యుల కోసం రూ.10 కోట్లు కూడా కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? పీఆర్‌సీపై ప్రభుత్వం స్పందించి, అమలు చేయాలి.
డాక్టర్‌ జయధీర్‌
ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " పీఆర్‌సీ కోసం వైద్యుల పోరుబాట"

Post a Comment