విద్యావ్యవస్థ ప్రక్షాళన


  • వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ప్రత్యేక కిట్లు
  • 200కోట్లతో మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు
  • విద్యార్థుల గురించి ఇంతగా ఆలోచించే సీఎం నేనొక్కడినే
  • ‘నాడు-నేడు’తో 45వేల బడుల రూపురేఖలు మారుస్తాం
  • అమ్మఒడి పథకంలో నమోదుకు గడువు మరో నెల పెంపు
  • పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రులు భాగస్వాములవ్వాలి
  • అమ్మఒడి ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి జగన్‌

చిత్తూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ‘మన పిల్లలు దేశంలోనే కాదు.. ప్రపంచంతో పోటీ పడాలని ఈ ముందడుగు వేశా. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నా. పేదరికం కారణంగా పిల్లల్ని చదివించలేకపోతున్న తల్లులను నా పాదయాత్రలో చూశా. అలాంటివారి కోసమే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టా’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని గురువారం ఆయన చిత్తూరులో ల్యాప్‌టాప్‌ ద్వారా ప్రారంభించారు. మెసానికల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న ఆయన అక్కడినుంచి 4కిలోమీటర్లు రోడ్‌ షోగా పీవీకేఎన్‌ కళాశాల మైదానంలోని సభావేదికకు చేరుకున్నారు. విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. ‘‘అమ్మఒడి అర్హుల జాబితాలో పేర్లు నమోదు కానివారు ఆందోళన చెందకండి. వారికోసం మరో నెల రోజులు గడువు పెంచుతున్నాం. ఫిబ్రవరి 9లోగా అలాంటి తల్లులు మళ్లీ నమోదు చేసుకోవచ్చు. రూ.15వేలు మరో విడతలో జమచేస్తాం. ఆయా తల్లులకు బ్యాంకులో బకాయిలున్నప్పటికీ అమ్మఒడి నిధులు జమ చేసుకోకుండా అందించేలా బ్యాంకు అధికారులను కోరాం. 1నుంచి 10వ తరగతుల విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి వర్తిస్తుందని మేనిఫెస్టోలో చెప్పినా.. ఇంటర్‌ విద్యార్థులకూ వర్తింపజేసి, మెరుగ్గా అమలు 

 ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం మెనూతో పాటు సిలబ్‌సలోనూ మార్పులు చేస్తున్నాం. మధ్యాహ్న భోజన మెనూ మార్పు చేసినందుకు రూ.200కోట్లు అదనంగా ఖర్చవుతున్నా సంతోషంగా భరిస్తున్నా. గతంలో మధ్యాహ్న భోజనం ఆయాలకు రూ.వెయ్యి ముష్టిగా ఇచ్చేవారు. ప్రస్తుతం దాన్ని రూ.3వేలకు పెంచా. దీనికి రూ.160కోట్లు అదనంగా ఖర్చవుతోంది. మధ్యాహ్న భోజన మెనూను దగ్గరుండి తయారుచేశా. అన్నం, పులిహోర, వెజిటబుల్‌ రైస్‌, కిచిడీ, గుడ్డు కూర, ఉడికించిన గుడ్లు, టమాటా చెట్నీ, ఆలూ కుర్మా, మిఠాయి వంటివాటిని జత చేస్తున్నాం. విద్యార్థుల మెనూ గురించి ఇంతలా ఆలోచించే సీఎం నేను ఒక్కడినే అనుకుంటున్నా. ‘నాడు-నేడు’లో భాగంగా 45వేల ప్రభుత్వ పాఠశాలలతో పాటు వసతి గృహాలు, కళాశాలల రూపురేఖలు మార్చనున్నాం. మొదటిదశలో సంక్రాంతి తర్వాత 15,715 బడుల స్థితిగతులను మారుస్తున్నాం. మంచినీళ్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌, ప్రహరీ, ఫ్యాన్లు, లైట్లు వంటి మౌలిక వసతులు మెరుగుపరుస్తాం.
 
మూడు జతల యూనిఫాం, పుస్తకాలు కలిపి ఓ బ్యాగులో పెట్టి ఆ కిట్‌ను విద్యార్థులకు పంపిణీ చేస్తాం. ఇంటర్‌ తర్వాత డిగ్రీకి వెళ్తున్న విద్యార్థుల శాతం 23మాత్రమే. చాలామంది ఇంటర్‌తోనే చదువును ఆపేస్తున్నారు. వీళ్ల జీవితాలు బాగు చేసేందుకు ‘జగనన్న విద్యాదీవెన’తో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అందిస్తున్నా. ‘జగనన్న వసతి దీవెన’తో ఏటా రూ.20వేలను రెండు విడతల్లో నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ చేయనున్నాం. బహుశా పిల్లల గురించి ఇంతలా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా ఉండడు’’ అని జగన్‌ పేర్కొన్నారు.
 
పాఠశాలల కోసం రూ.వెయ్యి ఇవ్వండి
‘‘విద్యార్థులకు ఒక మంచి మేనమామగా, వారి తల్లులైన నా అక్కలు, చెల్లెమ్మలకు ఒక చిన్న విన్నపం. అమ్మఒడి ద్వారా రూ.15వేలు తీసుకుంటున్న తల్లులు రూ.ఒక వెయ్యిని పాఠశాల నిర్వహణకు కేటాయించండి. నాడు-నేడు ద్వారా నేను పాఠశాలల రూపురేఖల్ని ఎంతలా మార్చినా.. నిర్వహణ లేకుంటే మళ్లీ సమస్యలు పునరావృతమవుతాయి. ప్రతిఒక్కరూ కచ్చితంగా రూ.వెయ్యి చెల్లించి మీ బాధ్యతను నిరూపించుకోండి’’ అని సీఎం కోరారు.
 
వాళ్లకు వినిపించేలా గట్టిగా చెప్పండి
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలనే నిర్ణయం తీసుకుని పిల్లల చదువు విషయంలో మరో అడుగు ముందుకేశానన్నారు. మీ పిల్లలకు ఇంగ్లీషు మీడియం కావాలో, ఒద్దో చెప్పండి అని ఆయన సభలో ప్రశ్నించారు. ‘ఈనాడు’కు, చంద్రబాబుకు, ఓ సినిమా యాక్టర్‌కు వినిపించేలా గట్టిగా చెప్పమని అడిగారు. ‘‘వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో 1నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలుచేస్తాం. ఆపై వచ్చే సంవత్సరం నుంచి ఏడాదికో తరగతిని పెంచుకుంటూ పోతాం. వచ్చే నాలుగేళ్లలో పదో తరగతి వరకు పూర్తిస్థాయిలో ఇంగ్లీషు మీడియం అమలుచేస్తాం. ప్రారంభంలో ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెడుతున్నాం. ఉపాధ్యాయులకూ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నాం.
 
దీన్ని అడ్డుకుంటున్న పత్రికల యజమానులు, సినిమా యాక్టర్లు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పేదల, కూలీల పిల్లలు చదువుకుంటారు. వీరి బతుకులు మారాలనే ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాను’’ అని జగన్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
 
బాబును రాష్ట్రంలో తిరగనివ్వకండి
‘అమ్మఒడి’ సభలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
రాజధాని అంశం ఆసరాగా ప్రజలను రెచ్చగొడితే రాష్ట్రంలో చంద్రబాబును ఎక్కడా తిరగనివ్వకుండా చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అమ్మబడి సభలో ఆయన మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో తన అనుచరుల భూములను కాపాడుకోవడానికి చంద్రబాబు రైతులను రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా రాజధాని రాద్ధాంతం ఆపాలన్నారు. రాజధాని పేరుతో దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేయక తప్పదని మంత్రి హెచ్చరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to " విద్యావ్యవస్థ ప్రక్షాళన"

Post a Comment