జిల్లాకు చేరిన ఎస్జీటీ (తెలుగు) ప్రొవిజనల్ జాబితా
● 14, 15 తేదీల్లో వెరిఫికేషన్ ప్రక్రియ?
పరీక్షకు హాజరైన అభ్యర్థులు (దాచిన చిత్రం)
కర్నూలు విద్య, న్యూస్టుడే : ఎట్టకేలకు డీఎస్సీ-2018 ఎస్జీటీ (తెలుగు) అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ప్రకటించిన డీఎస్సీ-2018 నోటిఫికేషన్ భర్తీకి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదు. పరీక్షల నిర్వహణలో లోపాలున్నాయన్న కారణంతో అప్పట్లో విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని భయపడిన అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది
జిల్లా వ్యాప్తంగా జడ్పీ, మున్సిపల్, ఎంపీపీ, ఆదర్శ, సంక్షేమ పాఠశాలల్లో 608 పోస్టులకు డీఎస్సీ-2018 పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. అందులో తెలుగు మాధ్యమ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు సంబంధించి ప్రకటన జారీ చేశారు. వీటికి పలు కారణాల దృష్ట్యా ఇటీవల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టలేదు. ప్రస్తుతం విద్యాశాఖలో స్పోర్ట్స్ కోటా మినహాయించి మిగిలిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించేందుకు ముందుగా వెరిఫికేషన్ చేసేందుకు ఎంపికైన ప్రొవిజనల్ జాబితాను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపారు. జిల్లాకు పంపిన జాబితాలో 396 మంది అభ్యర్థుల పేర్లను సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. వీటిని డీఈవో కార్యాలయ అధికారులు పరిశీలన చేసి కలెక్టర్ ఆమోదానికి ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తైతే ప్రొవిజనల్ జాబితాలోని అభ్యర్థులకు ఈనెల 14, 15 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఈ సబ్జెక్టులకు సంబంధించి న్యాయస్థానంలో కొలిక్కిరావడంతో ధ్రువపత్రాల పరిశీలన చేసేందుకు విద్యాశాఖ ఎంపిక జాబితాను జిల్లాకు పంపింది. వెరిఫికేషన్ తేదీని ప్రొవిజనల్ జాబితాలోని అభ్యర్థుల చరవాణికి సంక్షిప్త సందేశాన్ని పంపుతారు
0 Response to "జిల్లాకు చేరిన ఎస్జీటీ (తెలుగు) ప్రొవిజనల్ జాబితా"
Post a Comment