త్వరలో గ్రామ న్యాయాలయాలు

అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ న్యాయాలయ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మొత్తం 11 జిల్లాల్లో 84 చోట్ల వీటని ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రారంభ దశలో వసతి, వాహనం, కార్యాలయ సామగ్రి, పరికరాల కొనుగోలుకు ఒక్కోదానికి రూ.18లక్షల చొప్పున కేంద్రం నిధులు కేటాయించనుంది. వీటి నిర్వహణకు తొలి మూడేళ్ల పాటు సగటున 50శాతం వాటాగా కేంద్రం రూ.3.2లక్షలు ప్రతి న్యాయాలయానికి ఇవ్వనుంది. ఆ తర్వాత వీటిని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిచాల్సి ఉంటుంది. మధ్యంతర స్థాయిలో జిల్లాల్లోని కొన్ని పంచాయతీలు కలిపి ఒక గ్రామ న్యాయాలయంగా ఏర్పాటు కానున్నాయి. ప్రతి న్యాయాలయ పరిధిని ప్రకటించాల్సి ఉంటుంది. వీటిలో న్యాయాధికారితో పాటు, హెడ్‌ క్లర్క్‌, టైపిస్టు, స్టెనో, అటెండరు ఉంటారు. దేశవ్యాప్తంగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం 2009లో గజిట్‌ తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 139 గ్రామ న్యాయాలయాలకు ప్రతిపాదనలు అందగా రాష్ట్ర విభజనతో 84 ఏపీలో ఏర్పాటు కానున్నాయి. అయితే కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్కటీ లేకపోవడంతో వీటి సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అనుమతి కోసం త్వరలోనే కేంద్రానికి నివేదించే అవకాశం ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " త్వరలో గ్రామ న్యాయాలయాలు"

Post a Comment