ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌

*ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌*



*ఆసక్తిగా తిలకించిన ఇస్రో శాస్త్రవేత్తలు*




దిల్లీ: 

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌-2’ అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ఈ వ్యోమనౌకలోని ఆర్బిటర్‌ నుంచి ‘విక్రమ్‌’ ల్యాండర్‌ విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1:15 గంటల మధ్య ఈ  ప్రక్రియ కొనసాగింది. ల్యాండర్‌ విడిపోయే దృశ్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. ల్యాండర్‌ విడిపోయిన అనంతరం చందమామ ఉపరితలంపై ల్యాండింగ్‌ ప్రక్రియకు అది మరింత చేరువకానుంది.
జులై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి, ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగుసార్లు దాని కక్ష్యను ఇస్రో తగ్గించింది. ఆదివారం సాయంత్రం 6.21 గంటలకు ఐదోసారి ఆ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. చంద్రయాన్‌-2ను జాబిల్లి చుట్టూ ఉన్న 119 కిలోమీటర్లు× 127 కిలోమీటర్ల కక్ష్యలోకి చేర్చింది. ఈ కక్ష్య దాదాపుగా వృత్తాకారంలో ఉంది.


చంద్రయాన్‌-2 వ్యోమనౌక పైభాగంలో ల్యాండర్‌ ఉంటుంది. దీన్ని క్లాంపులు, ప్రత్యేక బోల్టులతో ఆర్బిటర్‌కు అనుసంధానించారు. సోమవారం నిర్దేశిత కక్ష్య పరిధిలోకి చేరగానే ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయేలా ఇస్రో సంకేతాలు పంపింది. విడిపోయే ప్రక్రియ కొన్ని మిల్లీసెకన్లలోనే  పూర్తయింది.  తొలుత ఆర్బిటర్‌, ల్యాండర్‌ను సంధానించే రెండు బోల్టులు తెగిపోయాయి. ఫలితంగా ల్యాండర్‌ వేరుపడింది.
ఈ నెల 3, 4 తేదీల్లో మరోసారి ల్యాండర్‌ కక్ష్యను తగ్గిస్తారు. ఫలితంగా అది 35 కిలోమీటర్లు× 97కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుతుంది. ఈ నెల 7న అంతిమ ఘట్టం చోటుచేసుకుంటుంది. ఆ రోజున ల్యాండర్‌లోని ‘పవర్‌ డిసెంట్‌’ దశ ఆరంభమవుతుంది. ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు. ఆ తర్వాత 15 నిమిషాల్లో ల్యాండర్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగుతుంది. నాలుగు గంటల తర్వాత అందులోని రోవర్‌ బయటకు వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌"

Post a Comment