సరికొత్త ఏటీఎం నిబంధనలు తెలుసా..?


ఇంటర్నెట్‌డెస్క్‌: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత వారం సరికొత్త ఏటీఎం నిబంధనలను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 2.2లక్షల ఏటీఎం యంత్రాలు ఉన్నట్లు ఆర్‌బీఐ లెక్కలు చెబుతున్నాయి. ఏటీఎం, ఇతర నగదు లావాదేవీలు విఫలమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఇతర అంశాలను ప్రస్తావించింది. నగదు ఖాతా నుంచి తగ్గి ఏటీఎం నుంచి డబ్బు వినియోగదారుడికి అందనప్పుడు తగిన గడువులోగా రీఫండ్‌ కాకపోతే పరిహారం చెల్లించాలని పేర్కొంది. దీంతోపాటు పలు మార్పులను ఆర్‌బీఐ చేసింది. అవేంటో చూద్దాం..





కొత్త నిబంధనల ప్రకారం..

ఏటీఎం లావాదేవీ విఫలమై వినియోగదారుడి ఖాతా నుంచి డబ్బు తగ్గినప్పుడు నియమిత గడువు తేదీ లోపు తిరిగి జమ కావాలి

సాధారణంగా లావాదేవీ జరిగిన రోజుతోపాటు మరో 5రోజులు బ్యాంకుకు గడువు ఉంటుంది. దీనిని దాటి ఆలస్యమయ్యే ప్రతి అదనపు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి. మైక్రో ఏటీఎంలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

ఏటీఎంలో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, కమ్యూనికేషన్‌ కారణాల వల్ల లావాదేవీ విఫలమైతే .. దానిని లావాదేవీల లెక్కలోకి తీసుకోరు. చాలా బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఏటీఎం లావాదేవీలను ఉచితంగా అందజేస్తున్నాయి. వాటిని మించిన తర్వాత అదనపు లావాదేవీలుగా పరిగణిస్తాయి. ఆర్‌బీఐ కొత్త నిబంధన ప్రకారం విఫలమైన లావాదేవీలను లెక్కలోకి తీసుకొని ఛార్జీలను వసూలు చేయకూడదు. 
ఒక వేళ ఏటీఎంలో నగదు లేకపోవడంతో లావాదేవీ విఫలమైతే దానిని కూడా లెక్కలోకి తీసుకోకూడదు. దీనికి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. 
ఇక తప్పుడు పిన్‌ నంబర్లు ఇతర కారణాలతో లావాదేవీలు విఫలమైనా వాటిని కూడా సర్వర్లు లెక్కలోకి తీసుకోకూడదు. 
బ్యాలెన్స్‌ తెలుసుకోవడం, చెక్‌బుక్‌ అభ్యర్థనలు, నిధుల బదలాయింపులు, 'ఆన్‌-అజ్‌'(ఆదే బ్యాంకుకు సంబంధించిన డెబిట్‌కార్డుతో చేసేవి) లావాదేవీలును కూడా ఉచిత లావాదేవీలుగా పరిగణించకూడదు. ఈ విషయాలను ఆర్‌బీఐ ఆగస్టు 14న విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సరికొత్త ఏటీఎం నిబంధనలు తెలుసా..?"

Post a Comment