సాఫ్ట్‌ల్యాండింగ్‌కు 11 సార్లు విఫలమై.

యుఎస్‌ఎస్‌ఆర్‌ విజయం వెనుక కష్టం..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: యుఎస్‌ఎస్‌ఆర్‌(నాటి సోవియట్‌ యూనియన్‌).. అంతరిక్ష పరిశోధనల్లో దిగ్గజం. తొలిసారి అంతరిక్షంలోకి మనిషిని పంపిన ఘనత.. తొలిసారి చంద్రుడిపై మానవ పరికరాన్ని పంపిన రికార్డు.. యుఎస్‌ఎస్‌ఆర్‌ పేరుతోనే ఉన్నాయి. అంతేకాదు తొలిసారి చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఘనత కూడా దీనికే దక్కింది. అయితే.. ఇందు కోసం మాత్రం తీవ్రంగా శ్రమించింది. దాదాపు 11 వైఫల్యాల తర్వాత విజయాన్ని అందుకుంది. ఇక అమెరికా అయితే నాలుగు సార్లు ఇంపాక్టర్లు విఫలమైన తర్వాత ఐదో సారి ఆ దిశగా విజయం సాధించింది. చంద్రుడిపై అడుగుపెట్టడం అంత కష్టం




చంద్రయాన్‌-2 నుంచి సంకేతాలు రాకపోవడంతో ఇస్రో ఛైర్మన్‌ కంటతడిపెట్టుకొన్నారు. ఈ మిషన్‌తో ఇస్రో బృందానికి ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ఈ ఘటన వెల్లడిస్తోంది. చంద్రుడిపై పూర్తి నియంత్రణతో దిగడం(సాఫ్ట్‌ ల్యాండింగ్‌) చాలా కష్టమైన పని. ఈ విషయం ఇస్రో శాస్త్రవేత్తలకు బాగా తెలుసు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ '15 మినిట్స్‌ టెర్రర్‌'గా దాన్ని అభివర్ణించారు.

వైఫల్యాలతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ మొదలు..

చంద్రుడిపై దిగడానికి రెండు రకాల పద్దతులు ఉంటాయి. నేరుగా చంద్రుడిని అంతరిక్ష నౌక ఢీకొనడం ఒక విధానం. 1959లో యుఎస్‌ఎస్‌ఆర్‌ తొలిసారి లూనా2ను చంద్రుడిపై దింపింది. ఆ తర్వాత కూడా ఈ విధానాన్ని వినియోగించారు. ఈ మిషన్‌ను 'ఇంపాక్టర్‌' అని అంటారు. ఇక రెండోది సాఫ్ట్‌ ల్యాండింగ్‌. దీనిలో పూర్తిగా నియంత్రణతో చంద్రుడిపై అంతరిక్ష నౌక దిగుతుంది. తాజాగా భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఇదే విధానంలో వెళ్లింది. తొలిసారి చంద్రుడిపై మానవుడు తయారు చేసిన పరికరాన్ని పంపిన యుఎస్‌ఎస్‌ఆర్‌ అదే ఉత్సాహంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 1963 జనవరిలో దీనికి సంబంధించిన లూనా ఈ-6తో ప్రయత్నాలను ప్రారంభించింది. కానీ, ఇది విఫలమైంది. అప్పటికే అమెరికాతో అంతరిక్ష పోటీలో ఉన్న యుఎస్‌ఎస్‌ఆర్‌కు ఇది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశంగా మారింది. దీంతో యుఎస్‌ఎస్‌ఆర్‌ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో దాదాపు 11 ప్రయత్నాలు విఫలం అయ్యాయి. వీటిల్లో ఐదు సార్లు విజయం అంచుల వరకూ వచ్చి బోల్తాపడింది. ఎట్టకేలకు 1966జనవరి 31న లూనా9 రూపంలో 12వ సారి విజయం సాధించింది. తొలిసారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన దేశంగా ఇది ఘనత సాధించింది. 1963-66 మధ్యలో వరుసగా 12సార్లు చంద్రుడిపైకి అంతరిక్ష నౌకలను పంపించిందంటే యూఎస్‌ఎస్‌ఆర్‌ ఎంత పట్టుదలతో ప్రయత్నించిందో అర్థమవుతోంది. ఆ తర్వాత కూడా చాలా ల్యాండర్‌ ప్రయోగాలు విఫలం అయ్యాయి. చంద్రుడిపై ఇప్పటివరకూ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం మొత్తం 47 ప్రయత్నాలు జరగ్గా.. వాటిల్లో 27 మాత్రమే విజయంవతమయ్యాయంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.

భారత్‌ చాలా మెరుగు..

భారత్‌ కేవలం రెండో ప్రయత్నంలోనే ఇక్కడ వరకు చేరుకుందంటే చాలా గొప్ప. శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతో ముందున్న ఇజ్రాయిల్‌ కూడా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ విషయంలో విఫలం అయింది. బెరెషీట్‌ పేరుతో ఇజ్రాయిల్‌ మూన్‌మిషన్‌ చేపట్టింది. దీనిని స్పేస్‌ ఎక్స్‌ అంతరిక్షంలోకి చేర్చింది. కానీ, భారత్‌ సొంతంగా జీఎస్‌ఎస్‌ల్‌వీ రాకెట్‌ సాయంతో దీనిని అంతరిక్షంలోకి చేర్చింది. అంతేకాదు బెరెషీట్‌ ల్యాండర్‌కు బ్రిటన్‌ సాయం చేసింది. కానీ అది విఫలమైంది. అయితే చంద్రయాన్‌-2 ల్యాండర్‌ను ఇస్రోనే సొంతంగా తయారు చేసి చంద్రుడిపైకి పంపింది. ఈ రకంగా చూసుకుంటే భారత్‌ చాలా మెరుగైన స్థితిలో ఉందని చెప్పాలి.

చిన్నలోపం కూడా..

చంద్రయాన్‌-2లో విక్రమ్‌ ల్యాండర్‌కు చంద్రుడిపై దిగే బాధ్యతను అప్పగించారు. దీనికి అమర్చిన కెమెరా, వంద సెన్సర్లు, ఆన్‌బోర్డు కంప్యూటర్‌, లేజర్‌ పరికరాల సాయంతో చంద్రుడిపై దిగేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని స్వయంగా నియంత్రించుకొంటూ దిగాలి. ఈ నేపథ్యంలో ఆన్‌బోర్డు కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌తో సహా ప్రతి అంశం అత్యంత కీలకమైంది. చంద్రుడి వాతావరణాన్ని అంచనా వేస్తూ తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌లో ఒక్కచోట చిన్న అంచనా తప్పినా ప్రయోగం మొత్తం విఫలం అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇది ఇస్రోశాస్త్రవేత్తలకు కొత్త పాఠాలను నేర్పుతుంది. అంతెందుకు.. భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-1లో కూడా 5వేల డాలర్లు పెట్టి కొనుగోలు చేసి అమర్చిన చిన్న డీసీ టూ డీసీ కన్వర్టర్‌ విఫలం కావడంతో ఈ మిషన్‌ అనుకున్న సమయం కంటే ముందే భూమితో సంబంధాలను కోల్పోయింది. అంతేకాదు ఇంపాక్టర్‌ ఎంఐపీ నుంచి వచ్చిన సంకేతాలను విశ్లేషించడం కష్టం కావడంతో భారత్‌ కంటే ముందు నాసా చంద్రుడిపై నీటి జాడను పసిగట్టినట్లు ప్రకటించింది. నాసా కూడా చంద్రయాన్‌-1లోనే తన ఎం3(మూన్‌ మినరాలజీ మ్యాపింగ్‌)పరకరాన్ని పంపడం విశేషం. దీనిలోని ఇన్ఫ్రారెడ్‌ సంకేతాలను సకాలంలో విశ్లేషించడంతో తొలుత నాసా నీటిజాడను ప్రకటించింది. ఆ తర్వాత భారత్‌ కూడా తనకు వచ్చిన సంకేతాలను విశ్లేషించి ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

లోపాలను గుర్తించి చంద్రయాన్‌-3కు సిద్ధం..

ఈ సారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో లోపాలను గుర్తించి చంద్రయాన్‌-3కు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యే అవకాశం ఉంది. దీనిలో రోబోను పంపే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌ల్యాండింగ్‌ను భారత్‌ సాధిస్తే ఆ తర్వాత 'శాంపిల్‌ రిటర్న్‌' ప్రయోగాలను చేపట్టే అవకాశం ఉంది. అంటే చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను పంపి అక్కడి నమూనాలను సేకరించి తిరిగి భూమికి తీసుకురావడం అన్నమాట. ఇది విజయవంతమైతే చంద్రుడిపై నుంచి తిరిగి వచ్చే టెక్నాలజీ భారత్‌ సొంతం అవుతుంది. అప్పుడు మానవసహిత చంద్రయాన్‌ సాధ్యమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సాఫ్ట్‌ల్యాండింగ్‌కు 11 సార్లు విఫలమై."

Post a Comment