క్ష కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యం!

భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఐదేళ్లలో దేశంలోకి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ...2008-14 మధ్య సాధించిన పురోగతి లాంటిది కాకుండా.. దీర్ఘకాలిక వృద్ధి రేటు కోసం పని చేస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం తమపై మరింత బాధ్యతను పెంచిందన్న ప్రధాని.. అంచనాలు కూడా భారీగా ఉన్నాయన్నారు


. గత ఐదేళ్లలో సానుకూల పురోగతి నమోదైందన్నారు. గత ఫిబ్రవరి, జూలై నెలల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావాన్ని ప్రజలు విశ్లేషించాలన్నారు. బడ్జెట్లో ఎవరికి ఏ కేటాయింపులు చేశారని కాకుండా స్థూలంగా దేశ ప్రగతి కోణంలో ఆలోచించాలన్నారు

'గత ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాం. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నాం. వడ్డీరేట్లు తగ్గించాం. జీఎస్టీ, బ్యాంక్‌రప్టసీ కోడ్ లాంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం.

నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరిస్తున్నాం. మౌలిక వసతుల పెంపును వేగంగా పెంచుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు భారత్‌ను అద్భుత గమ్యంగా మార్చాం'' అని మోదీ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో భారత్ నాలుగేళ్లలోనే 65 స్థానాలు ఎగబాకింది.

ఇండియా అద్భుత పురోగతి సాధిస్తోందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ గత ఏడాది నవంబర్లో కొనియాడారు. ''జీఎస్టీని అమలు చేయాలని, బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా భారత్‌ను మార్చాలని, దేశంలోని అన్ని ఇళ్లకు విద్యుత్‌ను అందించాలని, 8 కోట్ల కుటుంబాలకుపైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, పది కోట్ల మందికిపైగా పేదలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించాలని ఐదేళ్ల క్రితం భావించాం. ఆ దిశగా పురోగతి సాధించామని మోదీ తెలిపారు. దీర్ఘకాలంలో స్థిరమైన పురోగతి సాధించడం కోసం బలమైన పునాదులు వేశాం.

గత ఐదేళ్లలో తక్కువ సగటు ద్రవ్యోల్బణంతో భారత్ వృద్ధిరేటు సగటు ఎక్కువగా నమోదైంది. కరెంట్ ఖాతా లోటు, విత్తలోటు, ద్రవ్యోల్బణం తదితర సూచీలను గణీయంగా తగ్గించలగలిగాం. ఈ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం పెరిగింది. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని ప్రధాని స్పష్టం చేశారు.

ఆర్థిక వృద్ధి అంటే దేశంలో సంపదను సృష్టించడం. అంతే కానీ ప్రభుత్వ ఖజానాను నింపడం కాదు. దేశ ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. సంపదను సృష్టి అంటే అందరి దగ్గర సమృద్ధిగా డబ్బు ఉండాలని మోదీ వెల్లడించారు.

''గత ఐదేళ్ల పాలన అనుభవంతో చెబుతున్నా.. అత్యున్నత లక్ష్యాలను సాధించేందుకు సరిపడా అన్ని లక్షణాలు భారత ప్రజల్లో ఉన్నాయి. కోట్లాది మంది రైతులు, లక్షలాది మంది పారిశ్రామికవేత్తలు, వేలాది మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, మహిళలు అందరూ సమష్టిగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉంది. వ్యాపారవేత్తలు ఎలాంటి గందరగోళం లేకుండా తమ పెట్టుబడుల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లొచ్చు.

ప్రభుత్వం వైపు నుంచి చట్టబద్ధంగా అన్నివిధాలుగా అండగా నిలుస్తామని వ్యాపారవేత్తలకు హామీ ఇస్తున్నా. ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్‌లో ఉత్పత్తులను పెంచేలా కృషి చేస్తున్నాం. ఆ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నాం. వారితో నిరంతరం చర్చలు జరుపుతున్నాం.

గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డీఐల ప్రవాహం నెమ్మదించింది. కానీ 2014-15 నుంచి 2018-19 మధ్య భారత్‌లోకి 286 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులొచ్చాయ''ని ప్రధాని తెలిపారు. మేకిన్ ఇండియా ప్రభావం చూపుతోందన్న మోదీ.. భారత్‌లో తయారైన మెట్రో రైళ్లు ఆస్ట్రేలియాలో నడుస్తున్నాయన్నారు.

ఎగుమతులను పెంచడం ద్వారా 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్న మోదీ.. ఈ దిశగా ఇప్పటికే మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేశామని, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం కోసం ప్రభుత్వ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధనాన్ని బడ్జెట్లో ప్రకటించామన్నారు. క్రమబద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టడం ద్వారా నిధులను పెంచుతున్నాం. ఈ చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుంది. త్వరలోనే ప్రయివేట్ పెట్టుబడులు పెరుగుతాయయని ప్రధాని మోదీ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "క్ష కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యం!"

Post a Comment