అసెంబ్లీ సీట్ల పెంపు
నియోజకవర్గాలు
కశ్మీరు కోసం మొదలైన కదలిక
ప్రాథమిక చర్చలు జరిపిన ఈసీ
జమ్మూ ప్రాంతంలో సీట్లు అధికం?
లోయలోకి కాందిశీకులు, పండిట్లు!
జనాభా పునరేకీకరణకు యోచన
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో ఆ రాష్ట్రంలో 7 సీట్లను పెంచాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు మంగళవారం అధికారులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోనూ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఉన్నందున ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీట్ల పెంపు అంశం చర్చకొచ్చినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిక్కింలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది.
ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి పరిశీలన జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటే పునర్విభజన కమిషన్ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ‘‘జమ్మూ కశ్మీర్ విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ నిబంధనల గురించి ఎన్నికల కమిషన్ సభ్యులకు తెలియజేశాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య అసెంబ్లీ సీట్లను పంచేందుకు అవలంబించిన ప్రక్రియ గురించి వివరించాం’’ అని సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగంలోని 170వ అధికరణ సవరించాలని గతంలో ప్రభుత్వానికి అటార్నీ జనరల్ సూచించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పార్టీ పరంగా బీజేపీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపునకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. త్వరలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలతో ఇదే విషయమై సమావేశం ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
జమ్మూలో ఏడు సీట్ల పెంపు?
జమ్మూ కశ్మీర్ను రెండు ముక్కలు చేసిన కేంద్రం అక్కడి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని కూడా సమూలంగా మార్చే పనిలో పడింది. కొద్దిరోజుల కిందట ఆమోదించిన బిల్లులో నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల కల్పన జరుపుతామని కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. చట్ట ప్రకారం ప్రస్తుతం 107గా ఉన్న సీట్ల సంఖ్యను 114కు పెంచుతామని కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై ఈసీ మంగళవారం ఇష్టాగోష్టిగా సమావేశమై చర్చించింది. విభజన చట్టం- సీట్ల పెంపు ప్రతిపాదనలు తమకు అందిన తరువాత దీనిపై కేంద్ర, కశ్మీర్ అధికారులతో సమావేశమై ఎలా ముందుకెళ్లాలన్నది చర్చిస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జమ్మూ ప్రాంతంలో సీట్ల సంఖ్యను పెంచాలని కేంద్రం యోచిస్తోంది. జనాభా పరంగా కశ్మీర్ కంటే చిన్నదైనా విస్తీర్ణ పరంగా జమ్మూ పెద్దది. హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ సీట్ల పెంపు బీజేపీకి లాభదాయకమని కేంద్రం భావిస్తోంది. మోదీ సర్కారుకు పెద్ద సవాలు లోయలోని ప్రాంతమే. 96 శాతం ముస్లింలున్న కశ్మీర్ను తమ అదుపులోకి తెచ్చుకోవాంటే జనాభా పునరేకీకరణ జరగాలని అంచనా వేసింది.
1989లో అంతర్గత ఘర్షణల వల్ల ప్రాణాలరచేత పట్టుకుని కశ్మీర్ నుంచి జమ్మూ ప్రాంతానికి వెళ్లిపోయిన అనేక మంది పండిట్లు, ఇతర హిందూ సిక్కు గ్రూపులను తిరిగి తీసుకురావాలన్న ఓ ఆలోచన కొన్నాళ్లుగా చేస్తున్నట్లు సమాచారం. దేశవిభజన సమయంలో పాక్-ప్రేరేపిత గిరిజన తెగల దాడులను తట్టుకోలేక మీర్పూర్ (ప్రస్తుత పీవోకే) నుంచి పారిపోయి వచ్చిన వేలాది కాందిశీకులను కూడా జమ్మూ నుంచి తిరిగి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. 1947 అల్లర్ల సమయంలో లక్ష మందికి పైగా హిందువులు, సిక్కులు పూంచ్, జమ్మూ ప్రాంతాలకు తరలి వచ్చారు. వీరందరినీ తిరిగి లోయలో నింపి- అక్కడి ముస్లిం ప్రాబల్యాన్ని తగ్గించాలని మోదీ సర్కార్ ప్లాన్. వారి భద్రత నిమిత్తం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
ఆసక్తికర అంశాలు గోచరిస్తాయి. రాష్ట్రంలో కులాలను ప్రధానంగా మూడు వర్గాలు చేయవచ్చు. (1) సయ్యద్లు (జిలానీ, గిలానీ, ఖాద్రీ, అంద్రాబీ, హందానీ, బుఖారీ, షా.. మొదలైనవి) (2) ఉద్యోగ కులాలు: వానీ, జర్గార్, భట్, నకాష్, లోన్, ఖాందే, అహ్నగర్ మొదలైనవి.. (3) సేవా కులాలు: హాంజీ, వాజా, గిల్కార్, సోఫీ, దోబీ, గనీ, దంబీ, షేక్ మొదలైనవి. ఇందులో పేరుకు ముందు షేక్ ఉంటే వారు బ్రాహ్మణ భూస్వామ్య వర్గాల నుంచి వచ్చినవారు అంటే షేక్ అబ్దుల్లా లాంటి వారు. పేరు చివరన షేక్ ఉంటే వారు నిమ్న కులానికి చెందినవారు. స్వీపర్లుగా, పాకీ పనిచేస్తూ గడిపేవారు.
కశ్మీరులో వేల సంఖ్యలో వాల్మీకి (సఫాయి కర్మచారీలు) కులస్తులు ఉన్నారు. వీరే కాక అనేక ఇతర కులాలు కూడా కశ్మీర్లో ఉన్నాయి. విశేషమేమంటే వీరిలో అత్యధికులకు ప్రాథమిక హక్కులు లేవు. ఎన్నికల్లో ఓటు వేయలేరు. కేవలం పని చేసుకు బతకడమే తప్ప వేరే ప్రపంచం తెలియదు. వీరందరి బతుకులూ ఓటర్లుగా మార్చాలని మోదీ సర్కారు యోచిస్తోంది. వీరిని వర్గ పరంగా చీల్చి- కొన్ని నియోజకవర్గాలను వారికి రిజర్వు చేస్తే ముస్లిం ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయవచ్చని, తద్వారా వేర్పాటు వాదాన్ని కూడా బలహీన పర్చవచ్చనీ కేంద్రం వ్యూహం రచిస్తోంది. మొత్తం మీద- రాష్ట్ర భౌగోళిక సరిహద్దులను పునర్నిర్వచించడమే కాదు రాజకీయ స్వరూపాన్ని కూడా మార్చేసే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది.
0 Response to "అసెంబ్లీ సీట్ల పెంపు"
Post a Comment