15 నుంచి విధుల్లోకి గ్రామ వలంటీర్లు
ఇప్పటికే క్షేత్రస్థాయిలో శిక్షణ
విధి విధానాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి
50 కుటుంబాలకు ఒక వలంటీర్
జిల్లా వ్యాప్తంగా 14,460 మంది వలంటీర్లు
వారితో 31 రకాల సేవలు
ఒంగోలు(కలెక్టరేట్), ఆగస్టు 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఈనెల 15వతేదీ నుంచి పనిచేయనుంది. అందుకు అవసరమైన ప్రక్రియను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను పెంపొందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున ప్రకటించారు. అందుకు అనుగుణంగా గ్రామ వలంటీర్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒక వలంటీర్ నియామకం కోసం భర్తీకి శ్రీకారం చుట్టారు. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా 14,460 పోస్టులకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియ గత నెలాఖరుకు ముగియడంతో గ్రామ వలంటీర్లు గ్రామాల్లో చేయాల్సిన విధి విధానాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.
వలంటీర్లకు శిక్షణ పూర్తి
గ్రామాల్లో ఈనెల 15వతేదీ నుంచి వలంటీర్లు విధుల్లో చేరాల్సి ఉండటంతో అందుకు అనుగుణంగా కలెక్టర్ పోలా భాస్కర్ ఆధ్వర్వర్యంలో వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. మండల స్థాయిలోని పది విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారుల నేతృత్వంలో మాస్టర్ శిక్షణ పొందిన అధికారుల ద్వారా గ్రామవలంటీర్లు గ్రామాల్లో చేయాల్సిన విధి విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణను ఈనెల 6వతేదీ నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
వలంటీర్ల ద్వారా 31 రకాల సేవలు
గ్రామ వలంటీర్ల ద్వారా 31 రకాల సేవలు అందించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా గ్రామవలంటీర్లు గ్రామాల్లో ఉండి సమస్యలను పరిష్కరించాలి. ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించే విధంగా మండల స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామాల్లోకి కొత్తగా ప్రవేశించిన వ్యక్తుల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు సేకరించి పంచాయతీకి అందజేయాల్సి ఉంది. విధుల్లో చేరిన వలంటీనేకల ఈనెల 15వ తేదీ నుంచి 15 రోజుల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అబివృద్ధి పథకాలపై 50 కుటుంబాల ప్రజలకు అవగాహన కల్పించాలి.
గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఇవీ...
కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందించాలి.
తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి. అందుకోసం తరుచుగా గ్రామ, వార్డు సచివాలయంతో పాటు అధికారులతో సమన్వయం చేసుకోవాలి.
లబ్ధిదారుల ఎంపిక, సమస్యల పరిష్కారంలో గ్రామ వలంటీర్లదే కీలక పాత్ర. వినతులు పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా వ్యవహరించాలి.
ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించాలి. తమ పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి వారికి ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించాలి.
గ్రామ, వార్డు సచివాలయం నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలి. తన పరిధిలో ప్రజానీకం సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ను తయారు చే సుకొని అధికారులకు అందించాలి.
లబ్ధిదారుల వివరాలు, ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపర్చాలి.
విద్య, ఆరోగ్యపరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.
తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రత తదితర వాటిని నిరంతరం పర్యవేక్షించాలి.
పెన్షన్ పంపిణీ, బియ్యం ఇతర నిత్యావసర వస్తువుల డోర్ డెలివరీ చేయాలి.
రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల పంపిణీని వలంటీర్ చేపట్టాలి.
పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో పనిచేసే వలటీర్లు గ్రామ సచివాలయం కోరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి.
విపత్తుల నిర్వహణ, ఆకస్మిక సంఘటనల నేపథ్యంలో నిర్దేశిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలను అందించాలి.
మద్యపాన నిషేదం, బాల్యవివాహాలను రూపుమాపేందుకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉంది.
-andhrajyothi
0 Response to "15 నుంచి విధుల్లోకి గ్రామ వలంటీర్లు"
Post a Comment